దేశంలో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.
ఏపీలో 4, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావుల పదవీ కాలం ముగియనుంది.
అటు ఏపీలో కే కేశవరావు, తోట సీతారామలక్ష్మి, సుబ్బిరామి రెడ్డి, ఏకే ఖాన్ల స్థానాలు ఖాళీకానున్నాయి. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఏపీలో ఒక స్థానాన్ని.. బీజేపీకి ఇస్తారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇటు తెలంగాణలో కూడా రాజ్యసభ పదవి ఎవరికి దక్కుతుందోనని సందిగ్ధత నెలకొంది. ఇక మార్చి 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.