టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ట్వంటీ-20లకు మాత్రమే ధోనీ పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదాయ టెస్టుకు రాం రాం పలికేసిన ధోనీ.. వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇందుకు వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచే నిదర్శనం. అప్పటి నుంచి ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడని ధోనీ.. ఆ ఫార్మాట్కు కూడా బై చెప్పాలనుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి షాకిచ్చాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్నకు ఎంపిక చేసిన తన కలల జట్టులో ధోనీకి స్థానం కల్పించలేదు. అలాగే, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ను కూడా ఎంపిక చేయలేదు. ఇండోర్లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా లక్ష్మణ్ తనన కలల జట్టును కూర్చాడు. ఇందులో శివం దూబే, రిషబ్ పంత్లకు చోటు కల్పించాడు. కానీ ధోనీకి స్థానం ఇవ్వలేదు.
మరోవైపు మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఏ విధమైన ఫిట్నెస్ను కలిగి ఉన్నాడో ధోని కూడా అదే మాదిరి ఫిట్నెస్ను కలిగి ఉన్నాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని మంచి ప్రదర్శన చేస్తే టీ20 ప్రపంచకప్నకు పోటీలో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఫామ్ ధోని భవిష్యత్తుని నిర్ణయిస్తుందని రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా, ఓ జాతీయ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ 'మహీతో నేను ఏకాంతంగా మాట్లాడాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు'' అని అన్నాడు.