కరోనా నేపథ్యంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 19 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన అనేక విశేష ఆరాధనలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అర్చకులు బుధవారం వసంత మండపంలో పరిశీలించారు.
నవంబరు 19న గురువారం విష్ణుసాలగ్రామ పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నవంబరు 19, 22, 24 నుండి 28వ తేదీ వరకు, డిసెంబరు 1, 2, 5వ తేదీల్లో, ఆ తరువాత డిసెంబరు 10 నుండి 13వ తేదీ వరకు విష్ణుపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.