గాలిలో ఎగురుతున్న విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని పాకిస్థాన్ ఎయిర్లైన్స్ బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఈ నెల 14న పెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న పాకిస్థాన్ విమానంలో సిబ్బందితో గొడవకు దిగిన ఓ వ్యక్తి.. నానా రచ్చ చేశాడు.
విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. కిటికీలను కాళ్లతో తన్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. విమానయాన చట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. విమానం దిగిన వెంటనే దుబాయ్లో పోలీసులకు అప్పగించారు.