భార్యపై అనుమానంతో హైదరాబాద్ బోడుప్పల్లో ముక్కలు ముక్కలుగా నరికి మూసినదిలో పడేసిన ఘటనను మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను అడవిలో చంపి ఏకంగా కాల్చివేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం అనే యువకుడు 2014లో మహబూబ్ నగర్కు చెందిన శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు.
అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో శ్రావణి తన తల్లిగారి ఊరైన మహబూబ్ నగర్లో పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 21న భర్త శ్రీశైలం మహబూబ్ నగర్ వెళ్లి భార్యను కలిశాడు. బైక్పై సోమశిలకు వెళ్దామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.
అనంతరం పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అడవి ప్రాంతంలోకి తీసువెళ్లాడు. అనంతరం అక్కడ శ్రావణిని హత్యచేశారు. అనంతరం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టే ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే భర్తతో వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.
విచారణలో శ్రావణిని తానే చంపానని చెప్పడంతో పాటు హత్య చేసిన స్థలాన్ని చూపించాడు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.