పశ్చిమ త్రిపుర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తపై భార్య యాసిడ్తో దాడి చేసింది. ఏం చేయడమో తెలియక ఆ భర్త అయోమయ పరిస్థితుల్లో దాడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్తతో పాటు మోటారు బైకుపై వెళ్తున్న భార్య వెనక నుంచి భర్త ముఖంపై యాసిడ్తో దాడి చేసింది.
వృత్తిరీత్యా రైతు అయిన షిబాజీ దేబ్బర్మ అనే ఆ వ్యక్తికి భార్య చేసిన అకృత్యానికి ముఖం, మెడపై తీవ్రగాయాలైనాయి. గాయాలతో ప్రస్తుతం జిబిపి ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. "షిబాజీ దేబ్బర్మ, అతని భార్య సుమిత్ర దేబ్బర్మ బుధవారం తన బైక్ పై చాంద్పూర్ వైపు ప్రయాణిస్తున్నారు. వున్నట్టుండి, సుమిత్ర తన భర్తపై యాసిడ్ పోసింది.
ఈ ఘటనతో తీవ్రమైన నొప్పి కారణంగా అతను బైక్ ఆపి కిందకు దిగాడు" అని సిధై పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (OC) హిమాద్రి సర్కార్ అన్నారు. "ఏమి జరిగిందో తెలియక, అతను సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. అయినా అతని భార్య మళ్ళీ అతనిపై మరింత యాసిడ్ పోయడానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తిని వెంటనే జీబీపీ ఆస్పత్రికి తరలించారు," అని హిమాద్రి సర్కార్ చెప్పారు.
ఆ మహిళ గృహ హింస బాధితురాలిగా కనిపిస్తోందని, భర్త వేధింపులు తాళలేక అతనిపై యాసిడ్ దాడి చేసిందని హిమాద్రి సర్కార్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.