Shorts

హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మహిళా మంత్రిపై తమిళనాట ప్రముఖ యూ ట్యూబర్ మారిదాస్ అసభ్యకరమైన వీడియోను చేసి పోస్ట్ చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనితో అతడిపై చెన్నై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదయ్యింది. సోమరవారం ఉదయం మధురైలోని అతడి నివాసానికి చెన్నై పోలీసులు వెళ్లారు. మధురై నగర పోలీసులను వెంటబెట్టుకుని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసారు.కాగా మారిదాస్ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలోని మహిళా మంత్రితో పాటుగా మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 352(2) కింద కేసు నమోదు చేసారు.

కాచిగూడలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. మే 27 నుండి కాచిగూడలో కనిపించకుండా పోయిన బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి అంకం రాహుల్, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బావి వద్ద శవమై కనిపించాడు.తాను ప్రేమ లేఖ రాసిన ఒక అమ్మాయికి క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడంతో రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మే 27న కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా వద్ద బయటకు వెళ్తున్నానని తనను ద్విచక్ర వాహనంపై అక్కడికి చేర్చిన స్నేహితుడికి చెప్పిన తర్వాత, 21 ఏళ్ల రాహుల్ ఆచూకీ తెలియకుండా పోయిందని కాచిగూడ పోలీసులు పేర్కొన్నారు. అతని తండ్రి అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వరల్డ్ కప్ 2026 కోసం రూపొందించిన కొత్త పాట ఎట్టకేలకు విడుదలైంది. ఇందులో బాలీవుడ్ తార నోరా ఫతేహి కనిపించారు. సీర్ సీర్ అని పేరున్న ఈ పాటను మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్, ఫ్రెంచ్ గాయకుడు వెజ్‌డ్రీమ్‌తో కలిసి రూపొందించారు. ఇది ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక సంగీత ప్రాజెక్ట్‌లో భాగంగా, టోర్నమెంట్ అధికారిక ఆల్బమ్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంగీత నేపథ్యాలు కలిగిన కళాకారులను ఈ ఆల్బమ్ ఒకచోట చేర్చుతుంది. నోరా ఫతేహి సోమవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పాటను పంచుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 వంటి కార్యక్రమంలో సీర్ సీర్ పాటను భారతదేశం బలమైన ప్రాతినిధ్యంగా నోరా ఫతేహి అభివర్ణించారు.

నల్గొండలోని కనకదుర్గ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న పబ్బతిరెడ్డి లింగారెడ్డి (45), సోమవారం సాయంత్రం తన 13 ఏళ్ల కుమారుడు ప్రణీత్ రెడ్డిని చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నల్గొండ మండలం మిర్లోనిగూడెంకు చెందినవారు. లింగారెడ్డి విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తుండగా, ప్రణీత్ నల్గొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. లింగారెడ్డి తన కుమారుడి తలపై సుత్తితో కొట్టి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో, ఒక కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న తమ పెద్ద కుమారుడిని కలిసేందుకు అతని భార్య హైదరాబాద్ వెళ్లగా, అతని తండ్రి ఉదయాన్నే పొలానికి వెళ్లారు.

బెట్టింగ్. ఈ వ్యసనంలో పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు ఎంతగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా కొంతమంది మాత్రం ఆ వ్యసనం నుంచి బైట పడలేకపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఓ డాక్యుమెంట్ రైటర్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు.అతడు క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్... తదితర వ్యసనాలకు 35 ఏళ్ల షేక్ సుభాని బానిసయ్యాడు. దీనితో అందినకాడికి అప్పులు చేసాడు. బెట్టింగ్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులవాళ్లు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గోల చేస్తుండటంతో ఏ దారి లేక చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

యూపీలో పెళ్లి పీటలపై ఆగిపోయింది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. కానీ పెళ్లి ఆగకుండా వుండేందుకు ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. దక్షిణాదిలో.. అంటే కేరళం, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కొన్నిచోట్ల పొత్తుల రూపంలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డీకె శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వైసిపితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఆరాటపడుతున్నట్లు సమాచారం.దక్షిణాదిలో ఇప్పటికే 4 రాష్ట్రాలు గుప్పెట్లో వున్నాయి కనుక ఏపీని కూడా లాగేస్తే ప్రధానమంత్రిగా పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం అవుతుందని రాహుల్ గాంధీ తలపోస్తున్నట్లు సమాచారం.