ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురిసింది. ఉత్తర కాశీ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా అపారనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ వద్ద పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు గుల్లంతయ్యారు. మరో ముగ్గురు చనిపోయినట్టు స్థానికుల సమాచారం.
ఉత్తర కాశీ జిల్లాలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. దీంతో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కుప్పకూలిపోయింది. నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న కార్మికుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వీరంతా హోటల్ శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కార్మికుల గల్లంతు ఘటనను ఉత్తర కాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య ధృవీకరించారు. 8 నుంచి 9 మంది కార్మికులు గల్లంతైనది నిజమేని ఆయన తెలిపారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా యాత్రికులు ఎక్కువగా ప్రయాణించే బార్కోట్ - యమునోత్రి మార్గం కూడా తీవ్రంగా దెబ్బతిందని దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెండ్ అలెర్ట్ జారీచేశారు.