జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలకడంతో పాటు.. ఆయనకు ఏకంగా వైట్హౌస్లో అధికారిక విందు భోజనం కూడా వడ్డించారు. ఈ పరిణామం తమ దౌత్య విజయంగా పాకిస్థాన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, డోనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్కు ఏమాత్రం రుచించడం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ను అమెరికా అక్కున చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది.
ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వైట్హౌస్లోని కేబినెట్ గదిలో ట్రంప్, జనరల్ మునీర్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడం విశేషం. సాధారణంగా ఒక దేశ సైన్యాధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్తో పాకిస్థాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ సమావేశం కావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూసివేసిన తలుపుల మధ్య జరిగిన ఈ విందు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
గతంలో పాకిస్థాన్ అధ్యక్షులుగా ఉన్న అయూబ్ ఖాన్, జియా ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి మాత్రమే అమెరికా నుంచి ఇలాంటి ఉన్నత స్థాయి ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఒక ఆర్మీ చీఫ్గా ఉన్న మునీర్ ఈ గౌరవం దక్కడాన్ని పాకిస్థాన్ అధికారులు తమ దౌత్యపరమైన విజయంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.