ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం చేసుకుంటున్న దాడుల కారణంగా అనేక సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు మాత్రం ఏమాత్రం పట్టువీడటం లేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకూ నిరాకరిస్తున్నాయి.
ఈ తాజాగా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువని ఆరోపించారు. ఆయనను చంపాలని టెహ్రాన్ కోరుకుంటోందని ఆరోపించారు.
'ఇరాన్కు ట్రంపే నంబర్ వన్ శత్రువు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలోనూ ఆయన ఓ నకిలీ ఒప్పందాన్ని పక్కనబెట్టి.. ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహ్రాన్ చూస్తోంది' అని నెతన్యాహు ఆరోపించారు.
ఇరాన్ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని ఇజ్రాయెల్ ప్రధాని దుయ్యబట్టారు. అందుకే, దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ముప్పును సమూలంగా తొలగించుకునేంతవరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా.. యావత్ ప్రపంచాన్నీ రక్షిస్తోందన్నారు.