లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ రాగా, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ల కామెడీ హైలైట్గా నిలవనుంది.
హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ ని అందించారు.. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎం.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.