తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ ప్లీనరీ సమావేశం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) జరుగనుంది. ఇందుకోసం 14 వేల మంది అతిథులను ఆహ్వానించనున్నారు. వీరికోసం 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వంటల తయారీ కోసం 5 వేల మంది పాకశాస్త్ర నిపుణులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ వంటల మెనూను ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ స్వయంగా ఎంపిక చేశారు.
ఈ సారి సమావేశంలో సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు.
ఈ ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్ కమిటీ ఇన్చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.