చోరీలకు వచ్చే కొందరు దొంగలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. తాము వచ్చిన పనిని పక్కనబెట్టి హాయిగా మద్యం సేవించడం లేదా వంట చేసుకుని ఆరగించడం లేదా పడక గదిలో నిద్రపోవడం వంటి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ దొంగ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చి ఆమ్లేట్ వేసుకుని ఆరగించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నిందితుడుని పోలీసులు అరెస్టు చేయగా, ఈ ఘటన మే నెల 22వ తేదీన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ శివారు ప్రాంతమైన చంద్రానగర్లో ఓ హోటల్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళ - తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన మార్తాండ్కు చెందిన శివకుమార్ అనే దొంగ స్థానికంగా ఉండే ఓ హోటల్లో చోరీ చేసేందుకు అర్థరాత్రి సమయంలో వెళ్లాడు. హోటల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ దొంగ నేరుగా వంటగదికి వెళ్లగా, అతనికి కోడిగుడ్లు కనిపించాయి. దీంతో స్టౌవ్ వెలిగించి ఆమ్లెట్ వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రిజ్లో గాలించగా పచ్చి బీఫ్ ప్యాకెట్ కనిపించింది. దాంతో వంట చేసుకుని తాపీగా ఆరగరించాడు. దాదాపు గంటకుపైగా హోటల్ గదిలోనే గడిపినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.
భోజనం ముగించిన తర్వాత దొంగ హోటల్లోని ఇతర ప్రాంతాలను పరిశీలించాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మర్చిపోయినట్టుగా భావిస్తున్న ఒక పర్సులో రూ.25 వేల నగదును తీసుకున్నాడు. ఆ తర్వాత సమీపంలోని ఓ గుడికి చెందిన హుండీని కూడా చోరీచేసి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి చూడగా, బీఫ్ ప్యాకెట్ సగం మాత్రమే ఉడటం, వంటగది చిందరవందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అనుమానంతో సీసీటీవీ పుటేజీని పరిశీలించగా దొంగ చేసిన పనులు బయటపడ్డాయి. దీంతో మే 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ విజువల్స్ను పాలక్కాడ్ పోలీసులకు అందజేయగా వారు కేసు నమోదు చేసి, ఆ దొంగను గుర్తించి అరెస్టు చేశారు. దొంగను శివకుమార్గా గుర్తించారు. పాలక్కాడ్లోని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.