బంగారు ఆభరణాలు వ్యాపారుల నిరవధిక ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వెండి మినహా మిగతా అన్ని రకాల విలువైన లోహాలతో తయారైన ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ, బడ్జెట్లో ప్రతిపాదించి, జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తామని ప్రటించింది. దీనిపై దేశవ్యాప్తంగా జ్యూయెలర్స్ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 29న అరుణ్ జైట్లీ కొత్త పన్నును ప్రతిపాదించగా, ఆపై మార్చి 2న ఆభరణాల దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారులు దాదాపు ఆరు వారాల పాటు సమ్మె జరిపారు. ఫలితంగా ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు ఒక శాతం పన్నును వెనక్కు తీసుకుంటున్నట్టు మంగళవారం తెలియజేసింది.