విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3 ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాహాళ్లకు రావడం తగ్గించేసిన ప్రస్తుత పరిస్థితులలో ఎఫ్ 3 ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.
ఎఫ్3 40 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని 50 రోజుల దిశగా పరుగులు పెడుతుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఎఫ్3.. ఏడు వారాల థియేటర్ రన్ పూర్తి కానిదే ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు బలంగా నిర్ణయించుకున్నారు. చిత్రాన్ని థియేటర్లో ఆస్వాదించడానికి ఇదీ అనుకూలంగా మారింది.
నైజాంలో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి అరుదైన ఫీట్ సాధించింది. 'ఎఫ్ 3' తన లైఫ్ టైమ్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 53.94 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా 70.94 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.134 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.