Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణాష్టమి రోజున ఏం చేయాలి?

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అని కూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:31 IST)
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అని కూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు. 
 
"పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడిరేయి జనియించినాడు చూడ గదరే
అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను"
 
అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. 
 
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
 
తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 
 
శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
 
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.
 
ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
 
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. మరి అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments