ఈ దఫా బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనం : తితిదే కీలక నిర్ణయం

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:36 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ సర్వదర్శనమే ఉంటుందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ యేడాది బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇదేసమయంలో పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. 
 
గరుడసేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దుచేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈదఫా తితిదే మరింత ముందుకెళ్లింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లనూ నిలిపివేసింది. వీటిని బ్రహ్మోత్సవాల పది రోజులూ రద్దుచేయడంతో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 
 
నేడు జరగాల్సిన తితిదే కల్యాణమస్తు వాయిదా! 
తితిదే ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా పడినట్లు సమాచారం. 2011లో ఆగిపోయిన కల్యాణమస్తును తిరిగి 2022లో తితిదే ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద హిందూ కుటుంబాల్లోని యువతీ యువకులకు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహ వేడుకలను నిర్వహించాల్సి ఉంది. 
 
అందులో భాగంగా చాంద్రమాన శుభకృత్‌ నామ సంవత్సరం శ్రావణ శుక్లపక్ష దశమి ఆదివారం ఉదయం 8.07 నుంచి 8.17 గంటల మధ్య అనురాధ నక్షత్రం, సింహలగ్నంలో వివాహాలు చేయించాలని పండితులు శుభ ముహూర్తం నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే చాలామంది సామూహిక వివాహాలకు జిల్లా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. తితిదే ఇప్పటివరకూ అధికారికంగా వాయిదాపై ఎలాంటి ప్రకటనా జారీచేయలేదు. త్వరలోనే మరో ముహూర్తం నిర్ణయించి కల్యాణమస్తును నిర్వహించేందుకు తితిదే సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్

ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్

అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు

ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క

ప్రయాగ్ రాజ్ - మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

తర్వాతి కథనం
Show comments