దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో మరో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మలు ఉన్నారు. అలాగే, తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లు ఉన్నారు. వీరందరితీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త మంత్రిమండలితో రాష్ట్రపతి గ్రూప్ ఫొటో దిగారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మలు హిందీలో ప్రమాణం చేశారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఇంగ్లీష్ ప్రమాణం చేశారు. త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, జయంత్ చౌదరి, మురుగన్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. మోడీతో సహా మెజార్టీ సభ్యులు హిందీలో ప్రమాణం చేశారు. మిత్రపక్షాలకు 11 బెర్తులను ప్రధాని మోడీ కేటాయించారు. అయితే, వారికి కేటాయించాల్సిన శాఖల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
మరోవైపు, మంత్రులుగా ప్రమాణం చేసిన 72 మంది మంత్రుల పేర్లను పరిశీలిస్తే,
ప్రధానిగా నరేంద్ర మోడీ తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్.డి.కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝి, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్ రావ్ జాదవ్లు ఉన్నారు.