కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్. ఆంజనేయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులను వసూలు చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై మంత్రి మండిపడుతూ.. ప్రైవేటు విద్యా సంస్థలను వ్యభిచార గృహాలుగా పేర్కొన్నారు.
'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు.