కలయా.. నిజమా : కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేసిన జయలలిత నెచ్చెలి శశికళ
తమిళనాడు రాష్ట్రంలో అత్యంత అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఈ తరహా దృశ్యాలు, సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స
తమిళనాడు రాష్ట్రంలో అత్యంత అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఈ తరహా దృశ్యాలు, సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలితను డీఎంకే నేత ఎంకే స్టాలిన్, డీఎంకే చీఫ్ కరుణానిధి భార్య రాజాత్తి అమ్మాళ్, కుమార్తె కనిమొళితో పాటు పలువురు డీఎంకే నేతలు పరామర్శించారు.
ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకుగురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి జయలలిత నెచ్చెలి శశికళ వాకబు చేసినట్టు సమాచారం. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాల్ను శశికళ పరామర్శించినట్టు డీఎంకేలో చర్చ సాగుతోంది. అయితే, ఈ వార్తలపై అన్నాడీఎంకే శ్రేణులు స్పందించడం లేదు.
మరోవైపు.. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నట్టు డీఎంకే వర్గాలు ప్రకటించాయి. ఆయనకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేదని వైద్యులు తేల్చారు. కేవలం బెంగళూరులో ఉన్న పెద్దకుమార్తె సెల్వి ఇంట్లో కొంత కాలం ఉండి విశ్రాంతి తీసుకోవాలన్న కాంక్షతోనే ముందస్తు వైద్య పరీక్షల నిమిత్తం కావేరిలో కరుణానిధి చేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.