నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్ సెంటర్) మరో ప్రయోగానికి ముస్తాబైంది. ఇప్పటికి 34 వరుస విజయాలతో ప్రపంచ అంతరిక్ష రంగాన్నే అబ్బురపరుస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రస్తుతం (పీఎస్ఎల్వీ-సీ33) 35వ రోదసి యానానికి సిద్ధమైంది.
ఈ ప్రయోగం కోసం మంగళవారం ఉదయం 9.20 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు కౌంట్డౌన్ జీరోకు చేరుకున్న వెంటనే 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహంతో పీఎస్ఎల్వీ-సీ33 రాకెట్ రోదసీలోకి దూసుకెళ్లనుంది. 20.19 నిమిషాల్లో ఉపగహ్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
ఈ ప్రయోగంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థకు అవసరమైన 7 ఉపగ్రహాలు రోదసిలో స్థిరపడినట్లవుతుంది. మన దేశంతోపాటు సరిహద్దుల్లో 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా వాహన చోదకులకు ఇవి సంకేతాలు అందజేస్తాయి. ఇస్రో విజయాశ్వమైన ధ్రువ ఉపగ్రహవాహక నౌక (పీఎస్ఎల్వీ) ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి చేరవేయనుంది. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (ఎస్పీఎస్) ద్వారా దేశంలోని వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడంతోపాటు రెస్ట్రిక్టెడ్ సర్వీస్ (ఆర్ఎస్) ద్వారా మిలటరీకి సేవలు అందించనున్నాయి.