అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీపై భారత్ కీలకమైన సమాచారాన్ని అమెరికాకు షేర్ చేసింది. ఈ సమాచారంతోనే అమెరిగా పటిష్టమైన నిఘా వేసి.. లాడెన్ను మట్టుబెట్టినట్టు భారత మాజీ జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు డాక్టర్ ఎస్డీ ప్రధాన్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన ఓ టీవీ చానెల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడెన్ ఆచూకీ విషయంలో అమెరికా, భారత్ పలు సందర్భాల్లో కీలక సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపారు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కుట్రలపై భారత్ను అమెరికా పలు సార్లు హెచ్చరించగా, ఉగ్రవాదుల సమాచారాన్ని భారత్ అమెరికాకు అందించిందని గుర్తు చేశారు.
2006-07 మధ్య పాకిస్థాన్లో జరిగిన రెండు కీలక సమావేశాల్లో లాడెన్ కుడి భుజమైన అల్ జవహిరి, అంతరంగికుడు ముల్లా ఒమర్ పాల్గొన్నారు. ఆ సమావేశాల తర్వాత వారిద్దరు రావల్పిండి వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యమయ్యేవారు. దీంతో బిన్ లాడెన్ పాకిస్థాన్లోని రావల్పిండి సమీపంలోనే దాక్కున్నట్లు భారత్ నిఘా వర్గాలు పసిగట్టి.. ఆ సమాచారాన్ని అమెరికా నిఘా వర్గాలకు చేరవేశాయి.
ఆ తర్వాత యూఎస్ నేవీ సీల్స్ సైనికులు... బిన్ లాడెన్ స్థావరంపై మెరుపుదాడి చేసి అతడ్ని హతమార్చినట్లు ఆయన తెలిపారు. అలాగే, 2007లో జరిగిన సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబ్ బ్లాస్ట్పై భారత్ను అమెరికా అప్రమత్తం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.