రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్కు ఎసరు పెడుతున్న వోడాఫోన్... ఎలా?
దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రియలన్స్ జియో ప్రకటించిన ఉచిత ఆఫర్లతో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి.
దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రియలన్స్ జియో ప్రకటించిన ఉచిత ఆఫర్లతో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. పైగా, తాము కూడా జీయో బాటలో పయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీన జియో ప్రకటించిన న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్కు వోడాఫోన్ ఎసరు పెట్టనుంది. ఇదే అంశంపై ఢిల్లీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసులో వోడాఫోన్కు అనుకూలంగా తీర్పు వస్తే జియో ఉచిత ఆఫర్లన్నీ బంద్ కానున్నాయి.
నిజానికి జియో దెబ్బకు టెలికాం దిగ్గజాలుగా ఉన్న ఇతర టెలికాం కంపెనీలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఎయిర్టెల్ తీవ్రంగా నష్టపోయింది. జియో ఫ్రీ ఆఫర్స్పై ఎయిర్టెల్ ఎప్పటికప్పడు ట్రాయ్కు ఫిర్యాదు చేస్తూ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. అలాగే, వొడాఫోన్ కూడా జియోపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్ను తుంగలో తొక్కి జియో ఈ ఫ్రీ ఆఫర్ను తీసుకొచ్చిందని, ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటీషన్పై ఈనెల ఆరో తేదీన విచారణ జరుగనుంది. ట్రాయ్ జియో విషయంలో మొదటి నుంచి మెతక వైఖరి అవలంభిస్తోందని, న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ అనే పేరుతో ఫ్రీ టారిఫ్ను పొడిగించినా మిన్నకుండిపోయిందని వాదించింది. ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే జియో ఫ్రీ టారిఫ్ ఆఫర్ను వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడనుంది.