గుక్కపట్టి ఏడుస్తున్నాడనే కోపంతో కన్నతల్లే తన బిడ్డను ఊపిరి ఆడకుండా చంపేసిన వింత ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. అయితే, ఆ ఘటన అనుకోకుండా జరిగిందే తప్ప ఇందులో తన ప్రమేయం ఏమి లేదని పోలీసుల విచారణలో తెలిపింది.
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఉత్తర కరోలినాకు చెందిన ఐషియా మేరీ పచేకో(22) అనే మహిళకు టైలర్ అనే చిన్నారి ఉన్నాడు. కాగా ఒకరోజు చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఐషియా కోపంతో చిన్నారి ఛాతీని నొక్కి పట్టుకుంది. దీంతో ఊపిరి ఆడని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆమె ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికొచ్చి పరిశీలించి చూడగా చిన్నారి మొహం, ముక్కు లోపలికి నొక్కి ఉండటం గమనించి ఆమెనే ఈ హత్య చేసినట్లు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై ఐషియా మేరీ పచేకో ఈ విధంగా వివరణ ఇచ్చింది... 'ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన, నేను కావాలని చేయలేదు.. నేను నా బిడ్డను ఎంతగానే ప్రేమస్తాను.. వాడి తల్లిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. బాగా ఏడుస్తున్నాడని ఛాతీపై నొక్కి పట్టుకున్నాను. అంతే తప్ప ఇంకే తప్పు చేయలేదు' అని ఆమె వివరణ ఇచ్చింది.