భారతీయ కార్ల తయారీ మార్కెట్లోకి అడుగుపెట్టిన అనతికాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కియా మోటార్స్ ఇపుడు అదిరిపోయే ఫీచర్లతో ఈవీ-6 పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారును వచ్చే నెల రెండో తేదీన గ్రాండ్గా లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కియా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఈ కార్లను బుక్ చేసుకోవచ్చు. అయితే టోకెన్ అడ్వాన్స్గా మూడు లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ కారులో 77.4 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. సింగిల్ చార్జితో 528 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేయొచ్చు. 5.2 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. అయితే, కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ కారుకు అమర్చే బ్యాటరీ కేవలం 80 నిమిషాలు అంటే ఒకటిన్నర గంటలోనే ఫుల్ చార్జ్ అవుతుందని కియా యాజమాన్యం చెబుతోంది.