మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ‘కరోనా పోవాలి.. అమరావతి కావాలి!’’ అంటూ రాజధాని రైతులు నినదించారు. కరోనా నేపథ్యంలో కొంతకాలం పాటు దీక్షలు, ధర్నాలు విరమించుకోవాలని తుళ్లూరు మహాధర్నా శిబిరం సహా అన్ని శిబిరాలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.
అయితే, తొలినుంచీ కరోనాపై రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంట గంటకు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు లెక్క చేయాల్సిన పనిలేదు కానీ, వైరస్ నియంత్రణలో సహకరించలేదన్న అపవాదు వద్దు మనకు వద్దని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, అశోక్బాబు, శ్రావణ్కుమార్ వారికి సూచించారు.
ఈ నేపథ్యంలో పోరాటం రూపం మారుద్దామని పిలుపునిచ్చారు. వంతులువారీగా శిబిరాల్లో కూర్చొందామని 60 ఏళ్లు పైబడినవారు, పిల్లలను ఉద్యమానికి దూరంగా ఉంచుదామన్నారు. వెలగపూడి శిబిరంలో భేటీ అయిన జేఏసీ నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో తమ ఉద్యమతీరును మార్చాలని రైతులు నిర్ణయించారు. అందులోభాగంగా దీక్షా శిబిరాల్లో అందరూ కాకుండా వంతులవారీగా గంటకు 20 మంది చొప్పున కూర్చోవాలని నిర్ణయించారు.