ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఇప్పటికివరకు ఈ వ్యాధి కారణంగా చనిపోయినవారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ వ్యాధి సృష్టించిన కలకలంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
జిల్లాలోని ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ (44)అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2వ తేదీన వైద్యాధికారులు ఆయన నుంచి రక్త నమూనాలు సేకరించి, పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు.
ఈ నివేదికలు రాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం వచ్చిన నివేదికలో ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.
కాగా, ఈ మృతి కేసుతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి మరింత ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మొదునూరు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పురుగుకాటుకు గురైనపుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినపుడు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించాలని కోరారు.