ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిలకలూరి పేటలోని ZPHS మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్లో బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... పిల్లలూ... దేహ దారుఢ్యం కోసం వ్యాయామం చేస్తాం. మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. Books are the training weights for your mind. ఒక లక్షమంది మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుంది. ఉదాహరణకు జ్యూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉండటానికి పదిమంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది. అలాగే మీరు కూడా తయారవ్వాలి.
ఒక్కోసారి ఉపాధ్యాయులను చూస్తే నాకు బాధేస్తుంది. ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటేనే వారిని స్కూలుకు పంపిస్తే కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటిది ఒకేసారి ఇంతమంది పిల్లల్ని చూసుకోవాలి అంటే వారి అల్లరిని కట్టడి చేసి అలసిపోతారు. వాళ్ళు ఇంటికెళ్ళి వంటా వార్పు చేసుకోవాలి. అందుకని విద్యార్థులకు చెప్తున్నా వారు ఒక్కోసారి విసుక్కుంటారు. అవసరమైతే చిన్న దెబ్బ వేస్తారు. మనం వారి చేత దెబ్బ కొట్టించుకోకుండా ఉంటే వాళ్ళకి సగం బరువు తగ్గించినవాళ్లం అవుతాం.
అందుకని టీచర్లకు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి, మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు అవసరం. అలాంటి గురువు దీవెనలు మీరంతా నిండుగా పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆడపిల్లలకు చదువుతో పాటు మానసిక దారుడ్యం దేహ దారుడ్యం చాలా అవసరం. అందుకని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మంచి క్వాలిటీతో బలం ఉండే ఆహారాన్ని అందిస్తున్నాం.
పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం ఉంటుంది. అందుకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుంది అని చెప్పారు.