ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని భారతీయ జనతా పార్టీ నేతలు తెగేసి చెప్పడంపై టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శనివారం ఆయన కుటుంబసభ్యులు, పలువురు తెదేపా నాయకులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇపుడు ఇవ్వలేమని చెపుతున్న నేతలు.. ఇదే మాటను ఆనాడు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారు, తెస్తామన్నవారు ఇప్పుడేమయ్యారని హరికృష్ణ ప్రశ్నించారు.
కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి కార్యకర్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను కార్యకర్తలందరూ కొనసాగించాలని సూచించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఘాట్లో నందమూరి హరికృష్ణ, కల్యాణ్రామ్, తారకరత్న, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు.