6 వారాల్లోనే 100 కోట్లకు పైగా షేర్ సాధించి టాలీవుడ్లో సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్గా నిలబడ్డ సూపర్ సెన్సేషనల్ హిట్ 'శ్రీమంతుడు' సూపర్స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ (సివిఎం) సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' సెప్టెంబర్ 25కు 185 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం పూర్తిచేసుకొని సూపర్ కలెక్షన్స్లో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.
ఈ సందర్భంగా సూపర్స్టార్ మహేష్ మాట్లాడుతూ - ''కొరటాల శివగారు చెప్పిన కథ వినగానే ఎగ్జైట్ అయి ఓ మంచి సినిమా చేస్తున్నానన్న ఫీలింగ్తో కథని నమ్మి చేసిన సినిమా 'శ్రీమంతుడు'. ఓ మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు, అభిమానులు ఎంత గొప్పగా ఆదరిస్తారో 'శ్రీమంతుడు' సినిమా ద్వారా నాకు తెలిసింది. నా కెరీర్లో అన్ని విధాలా నాకు సంతృప్తిని కలిగించిన సినిమా 'శ్రీమంతుడు'. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ఇన్స్పిరేషన్గా నిలిచింది 'శ్రీమంతుడు' ఘన విజయం'' అన్నారు.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ - ''ఓ మంచి కథకు, మహేష్ బాబుగారి లాంటి సూపర్స్టార్ తోడయితే సక్సెస్ ఎంత పెద్ద రేంజ్లో వుంటుందన్న దానికి నిదర్శనంగా 'శ్రీమంతుడు' నిలబడినందుకు చాలా ఆనందంగా వుంది. 'శ్రీమంతుడు'ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కు, సూపర్స్టార్ కృష్ణ, మహేష్ బాబుగార్ల అభిమానులకు థాంక్స్'' అన్నారు.
నిర్మాతలు నవీన్, రవి, సివిఎం మాట్లాడుతూ - ''మా మైత్రి మూవీ మేకర్స్ తొలి చిత్రమే ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవడం.. 100 కోట్ల షేర్ దాటడం, 185 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం అంతా మాకు ఓ పెద్ద పండగలా వుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన సూపర్స్టార్ మహేష్గారికి, కొరటాల శివగారికి మా కృతజ్ఞతలు'' అన్నారు.