తన తండ్రి, టాలీవుడ్ హీరో మోహన్ బాబు పేరిట 'డాక్టర్ మోహన్ బాబు రూరల్ హెల్త్ స్కీమ్'ను ప్రారంభించినట్టు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ స్కీమ్ను ఆయన సోమవారం తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో శిశు మరణాలను తగ్గించడ, గర్భిణులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, రకరకాల వ్యాధుల ప్రభావం నుండి గ్రామవాసులను కాపాడటం ఈ పథకం ముఖ్యోద్దేశమని చెప్పారు.
ఇందుకోసం తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్కూల్కు చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ బృందాన్ని ఏర్పాటు చేయగా, ఈ బృందానికి 'ఆర్మీ గ్రీన్' అని పేరు పెట్టారు. ఈ బృందం విద్యార్థులు చంద్రగిరి మండలంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ స్కీమ్ వల్ల ఐదు గ్రామాల ప్రజలకు అనేక వైద్య ప్రయోజనాలు కలుగనున్నాయి. గ్రామస్థులకు వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులు కూడా అందచేస్తారు.
ఒక్కో గ్రామస్థుడి మీద సుమారు 4 నుంచి 5 లక్షలు వరకు ఖర్చు పెట్టనున్నారు. మెరుగైన ఆరోగ్యం... ఆరోగ్యకరమైన జీవితం అనే స్టోగన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంచు విష్ణు అన్నారు. ప్రస్తుతానికి ఐదు గ్రామాలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశామని... వచ్చే ఏడాది ఆఖరు కల్లా చంద్రగిరి మండలంలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తెలిపారు.