రజనీకాంత్ అల్లుడు ధనుష్ భవనం కూల్చి వేసిన సంఘటన తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. ఓ వైపు తను నటించిన ‘వేలయ్ ఇల్లా పట్టదారి' చిత్రం విజయం...మరో వైపు ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుక సంతోషం నుండి తేరుకోక ముందే ధనుష్కు షాక్ తగిలిందని చెప్పొచ్చు. ధనుష్ జులై 28తో 30వ వసంతంలోకి అడుగు పెట్టాడు.
కొలవెరి సాంగ్ హిట్టర్, ధనుష్కు అటవీశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న సగం పూర్తయిన ధనుష్కు చెందిన భవనాన్ని కూల్చేశారు. కోయంబత్తూరు జిల్లా వైదేహి నీర్ విళిచ్చి అటవీప్రాంతంలో (రిజర్వ్ ఫారెస్ట్) ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని... అందుకే కూల్చేశామని అటవీ అధికారులు తెలిపారు.
పలు జంతువులు సంచరించే ఈ అటవీప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవని... వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలో నిర్మాణాలు నిషేధమని తెలిపారు. అయినా ధనుష్ భవనం నిర్మిస్తున్న స్థలం అటవీశాఖకు చెందినదే అని చెప్పారు. అనుమతులు లేని స్థలాన్ని... పైగా అటవీ భూమిని ధనుష్కు ఎవరు అమ్మారు? ఎలా అమ్మారు? అనే విషయంపై ప్రస్తుతం అధికారులు దృష్టి పెట్టారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిన అనంతరం అధికారులు.....తదుపరి చర్య తీసుకోనున్నారు. అయితే ధనుష్ అది అటవీ భూమి అనే విషయం తెలియకుండా కొనుగోలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.