ప్రముఖ సినీదర్శకుడు, మాజీ కేంద్రమంత్రి డ ా|| దాసరి నారాయణరావు సతీమణి పద్మ (65) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను మంగళవారంనాడు సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో పద్మ తెల్లవారుఝామున 4.30కు కన్నుమూశారు. ఆమె చెన్నైలో ఆటో కార్మికుల సంఘానికి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె అంత్యక్రియలు శనివారం 8 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం తోల్కట్ట గ్రామంలోని స్వంత తోటలో నిర్వహించనున్నారు.
దాసరి పద్మ మృతి పట్ల తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం తెలిపారు. ఆయన దాసరికి ఫోన్ చేసి ఓదార్చారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన శివరంజని, ఒసేయ్ రాములమ్మ, మజ్ను, ఒరేయ్ రిక్షా, మేఘసందేశం వంటి సినిమాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం దాసరి టెలిఫిల్మ్ సర్క్యూట్తో వస్తున్న సీరియల్స్ను ఆమె నిర్మాత.
దాసరికి ప్రముఖుల పరామర్శ దాసరి నారాయణరావును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు పరామర్శించారు. రాష్ట్రమంత్రులు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్లతో పాటు సినీనటులు మోహన్బాబు, చిరంజీవి కుటుంబ సభ్యులు దాసరి స్వగృహానికి వచ్చి ఆయనను పరామర్శించారు. నన్నపనేని రాజకుమారి, దత్తాత్రేయ, కృష్ణమాదిగ, దానం నాగేందర్, హనుమంతరావు, గంగా భవాని, కెకె, తలసాని శ్రీనివాసయాదవ్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిదేవి, విష్ణువర్ధన్ పలువురు సినీరంగ ప్రముఖులు, శ్రేయోభిలాషులు పద్మపార్థివశరీరాన్ని సందర్శించి నివాళులర్పించారు.
పలువురు నివాళులు కైకాల సత్యనారాయణ: దాసరి పద్మ నన్ను 'అన్నా' అంటూ ఆప్యాయంగా పలుకరించేది. మద్రాసు నుంచి పరిచయం. అంతే ఆప్యాయంగా సొంత చెల్లెలుగా భావించేవాడిని. తాత మనవడు సినిమా నుంచి బాగా పరిచయం. ఆమె పేదల పాలిటి పెన్నిది, ఆర్థికంగా ఎంతో మందికి ఆడిగినవెంటనే ఆదుకునేది. స్వంతగా ఖర్చుపెట్టి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేది. మద్రాసు కాంగ్రెస్ పార్టీతరఫున పనిచేశారు. ఆమె గురించి అక్కడ తెలియనివారుండారు. కార్మికుల్ని బాగా చూసుకునేది. ఆమెలోని లోటు చాలా బాధగా ఉంది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఆర్.నారాయణమూర్తి అమ్మ తర్వాత అమ్మ అని పిలిపించుకునే అంతటి వ్యక్తిత్వంగలది. నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని చెప్పి మదరాసు వెళితే... నన్ను ఆదరించి అన్నం పెట్టింది. డబ్బులు అయిపోతే ఆమే ఆదుకుంది. ఓసారి తీవ్రమైన జ్వరం వస్తే... ఆసుపత్రిలో జేర్పించి ప్రాణాలు కాపాడిన మాతృమూర్తి. ఇంకా పలువురు ఆమెతో తమకుగల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కళ్ళుచెమర్చారు