చిరంజీవి బ్లాక్బస్టర్ చిత్రాల్లో ఒకటి "ఘరానా మొగుడు". ఈ చిత్రం విడుదలై రెండు దశాబ్దాలు (20 యేళ్ళు) పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 1992 ఏప్రిల్ 9న విడుదలైంది. ఈ చిత్రం.. అప్పట్లోనే పది కోట్ల రూపాయలను వసూలు చేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అంతేకాకుండా.. చిరంజీవి చిత్రాల్లో ఆల్ టైమ్ గ్రేట్ సినిమాగా నిలిచింది.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా, రావుగోపాల రావు నటించిన ఈ చిత్రానికి మాతృక "అనురాగ అరతుళి" అనే కన్నడం చిత్రం. దేవీ ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దేవీశ్రీ ప్రసాద్ నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్.
ముఖ్యంగా ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్టకు కుర్రకారు మాత్రమే కాకుండా వృద్ధులు కూడా సినిమా థియేటర్లో రెచ్చిపోయి డ్యాన్సులు చేశారు. వైజాగ్ పోర్టులో ఈ పాటను చిరంజీవి, డిస్కోశాంతిల మీదుగా దర్శకేంద్రుడు చిత్రీకరించారు. తల్లి తనయుడు, భార్యాభర్తల సెంటిమెంట్, కార్మికుల పక్షాన నిలబడే కార్మిక నేతగా, నవరసాలను పండించే పాత్రలో చిరంజీవి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుని తన సినీ కెరీర్లో ఎన్నిటికీ చెరిగోని హిట్ను సొంతం చేసుకున్నారు.