తెలంగాణ రాష్ట్ర సమితి బాస్ గా మరోమారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక నామినేషన్ రావడంతో అధ్యక్షుడుగా ఆయన ఎన్నికైనట్లే కాకపోతే అధికారకంగా ప్రకటించాల్సి ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి వ్యవహరించారు.
కేసీఆర్ తరఫున పార్టీకి చెందిన నాయకులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రుల తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీల నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుల తరఫున నల్లగొండ అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేల పక్షాన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ల తరఫున ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్ కవిత, అడహాక్ కమిటీ నుంచి కన్వీనర్ పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్లు వేశారు. ఇతర నేతలు ఆయన పేరును బలపరిచారు.
ఇతర పదవులకు నామినేషన్లు, ఎన్నికలలు ముగిసిన తరువాత ఒకేమారు 24వ తేదీన జరగనున్న పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.