యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి 3-0తో గెలుచుకున్న ఆనందంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. చివరి టెస్టు జరిగిన ఓవెల్ మైదానంలో బాగా పొద్దుపోయాక మద్యం తాగడమే కాక...పిచ్ పైనే మూత్రం పోశారు! మొదట డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లంతా తర్వాత మైదానంలోకి వచ్చి బృందంగా కూర్చున్నారు. మద్యం తాగారు.
తర్వాత కెవిన్ పీటర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ లేచి పిచ్ మీద మూత్రం కూడా పోశారని సమాచారం. ఆ సమయానికి మ్యాచ్ ముగిసి ఐదు గంటలైంది. మ్యాచ్ కవరేజీ కోసం వచ్చిన కొందరు ఆస్ట్రేలియా పాత్రికేయులు ఈ దృశ్యాన్ని చూడటంతో వ్యవహారం బట్టబయలైంది. మైదానంలో పెద్దగా వెలుతురు లేకపోవడంతో తమనెవరూ గమనించడం లేదని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ పనిచేసి ఉండొచ్చని భావిస్తున్నారు.