మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా పీవీ సింధు నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఆమె తన ప్రత్యర్థి జపాన్కు చెందిన క్రీడాకారిణి మిథానీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి భారత కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచింది. ఆట మూడు సెట్లు సాగినప్పటికీ, తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపిన సింధు 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది. మకావు ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం సింధుకు ఇది మూడోసారి కావడం విశేషం.
కాగా, మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా, సినీ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆమెకు తమ అభినందనల సందేశాలను ట్వీట్ చేశారు. ఆమెకు అభినందనలు తెలిపిన వారిలో హైదరాబాదీ మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్, ఎంపీ నవీన్ జిందాల్, నటి తాప్సి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప తదితరులు తమ సందేశాలను ట్వీట్ చేశారు.