బాంబే స్టాక్ మార్కెట్లో గురువారం సెన్సెక్స్ సూచీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడి 25,958 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,883 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత బలహీన పడి రూ.66.56 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో టాటా మోటార్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 5.49శాతం లాభపడి రూ.422.95 వద్ద ముగిశాయి.
అలాగే సన్ ఫార్మా, ఐడియా, గెయిల్, రిలయన్స్ సంస్థల షేర్లు సైతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో గురువారం డాక్టర్ రెడ్డీస్ సంస్థ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఔషధాల తయారీ లోపభూయిష్టంగా ఉందని లోపాలు సరిదిద్దుకోకపోతే నిషేధం విధిస్తామని ఆ సంస్థను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రభావం సంస్థ షేర్లపై కనిపించింది. 8.26శాతం నష్టపోయిన షేర్లు రూ.3,108 వద్ద ముగిశాయి. దీనితోపాటు టెక్ మహీంద్రా, టీసీఎస్, అదానీ స్పోర్ట్స్, బజాజ్ ఆటో సంస్థల షేర్లు సైతం నష్టపోయాయి.