తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను టిటిడి ఈవో సాంబశివరావు ఆదేశించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
టిటిడి నిర్మించిన ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించడానికి మార్పులు చేయడానికి సీఇ ఆధ్వర్యంలో స్థపతి, అర్చకులు, ఇంజనీరింగ్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. మే 10వ తేదీన శ్రీరామానుజ సహస్రాబ్ధి సంధర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలు, సీడీలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మే 22 నుంచి ప్రారంభం కానున్న శుభప్రదంకు అవసరమైన పుస్తకాల ముద్రణ పూర్తిచేయాలని సూచించారు. అలిపిరి వద్ద వాటర్ కూలర్స్ ఏర్పాటు చేయాలని, నడక దారిలో ఎండ వేడి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మెట్లపై తెల్లరంగు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.