కార్తీక మాసం ముగింపు సందర్భంగా చివరి రోజైన పాడ్యమి పర్వదినాన భక్తులు పుణ్యనదుల్లో కార్తీక దీపాలు వదిలారు. శనివారం వేకువజాము నుంచే భక్తులు పవిత్ర కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, స్వర్ణముఖి నదుల్లో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలు విడిచిపెట్టారు.
కృష్ణాజిల్లా విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద కృష్ణానదిలో వేకువ జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అనంతరం అరటి దొప్పలపై కార్తీక దీపాలు వెలిగించి కృష్ణానదిలో వదిలారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే, భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు భారీ సంఖ్యలో కార్తీక పుణ్యస్నానాలు చేశారు. విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు గోదావరిలో కార్తీక దీపాలను సమర్పించారు. ఈ సందర్భంగా తులసీమాతను ఆరాధించి అష్టోత్తరాలు పఠించారు. స్నానఘట్టాల సమీపంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు పోలాంబను స్వర్గానికి సాగనంపుతూ గోదావరి నదీపాయల్లో పోలు దీపాలు వదిలారు. వైనతేయ, వశిష్ట గోదావరి నదీ పాయాల్లో అధికసంఖ్యలో మహిళలు పుణ్యస్నానాలు చేసి దీపాలను నదీపాయల్లో సాగనంపారు.