గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి అనూహ్యంగా ముస్లిం మతగురువు మహమూద్ మదానీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. గోద్రా ఊచకోత కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ... 2002లో గుజరాత్లో జరిగిన మత అల్లర్లకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. అలాగే, గతంలో ముస్లింల టోపీ గౌరవ పూర్వకంగా ధరించాలని కోరినా ఆయన ధరించకపోవడం తెలిసిందే.
అయినా ముస్లిం మత గురువు నుంచి మద్దతు లభించింది. దీనిపై మదానీ మాట్లాడుతూ... టోపీ ధరించనంత మాత్రాన మోడీ చెడ్డ వ్యక్తేం కాదన్నారు. ఎంతో మంది టోపీలు ధరించి ముస్లింలను ఫూల్స్ను చేస్తున్నారని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గోద్రా అల్లర్లలో మోడీ తప్పుంటే ఆయన్ను శిక్షించాలని, క్షమాపణతో ఒరిగేదేం లేదన్నారు. ముస్లింలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మోడీకి మదానీ హితవు పలికారు.