అక్షరధామ్ దాడి కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. 2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన ఇద్దరు తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్లో ఉన్న అక్షరధామ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి చేశారు. ఇందులో 32 మంది చనిపోయారు. వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా, ఇద్దరు కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వు పోలీసుకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు.
ఈ దాడి కేసు విచారణ పోటా కోర్టులో జరుగగా, 2006 జులై ఒకటో తేదీన అదమ్ అజ్మెరీ, షాన్ మియా అలియాస్ చంద్ ఖాన్, ముఫ్తీ అబ్దుల్ ఖయ్యూమ్ మన్సూరీలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్.ఎం.దోషిత్, కేఎం.థకర్లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. పోటా కోర్టు విధించిన ముగ్గురికి మరణ శిక్షలను ధృవీకరించడమే కాకుండా, ఈ కేసులో మరో ముగ్గురు నిందితులకు కూడా జైలు శిక్ష విధించింది.