తనకు అధికారం ఇస్తే ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని లేదంటే తన ఫామ్ హౌస్లో హాయిగా నిద్రపోతానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
నల్గొండ జిల్లా కోదాడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. లేకుంటే హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.
సన్నాసులకు అధికారం ఇస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తారని విమర్శించారు. ఒక్క టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్న కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇకపోతే.. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయిన జైపాల్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా కూడా చేయకుండా పదవే పరమావధి అన్నట్లు కేంద్ర పదవిని అంటిపెట్టుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు పదవులను అనుభవించడం తప్ప ఏమి చేతకాదని ఆరోపించారు. అంతేకాక కాంగ్రెస్ సన్యాసులు తెలంగాణను అభివృద్ధి చేయలేరని అంటూ కెసిఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ను చిల్లర కొట్టు పార్టీ అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్ పై విధంగా విమర్శనాస్త్రాలు సంధించారు.