రాజంపేట బీజేపీ లోక్సభ అభ్యర్థిగా పురందేశ్వరి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి రావడంతో రాజంపేట స్థానానికే పురంధేశ్వరి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు పొత్తు వికటిస్తే విజయవాడ నుంచి బరిలోకి దిగాలని పురంధేశ్వరిని అందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఐతే పొత్తులపై ప్రతిష్టంభన తొలగిపోవడంతో రాజంపేట నుంచి పురంధేశ్వరి యధావిధిగా పోటీకి దిగుతున్నారు.
అంతుకుముందు బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతలు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలని సుజనా చౌదరి సూచించారు. ఇకపోతే నర్సాపురం లోక్సభ స్థానానికి రఘురామ కృష్ణంరాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ టీడీపీ తరపున, మరో సెట్ నామినేషన్ను బీజేపీ తరపున ఆయన సమర్పించారు.
ఇక తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి కొట్టు సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్లు వేశారు. ఒక సెట్ ఇండిపెండెంట్గా, రెండో సెట్ బీజేపీ తరపున, మూడో సెట్ టీడీపీ తరపున నామినేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు సూచనలతోనే వీరు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇరుపార్టీలు ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో పొత్తు వీగిపోయేలా కనిపిస్తోంది.