ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీ కాంగ్రెస్ మంత్రులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, అందువల్ల ఆయనను తక్షణం మార్చాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో టీ కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్లో పర్యటిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు వారు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై డిగ్గీ రాజాతో డిప్యూటీ సీఎం దామోదర నేతృత్వంలో టీ కాంగ్రెస్ నేతలు డీఎస్, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ తదితరులు సమావేశమై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా, తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పటికీ, అది అసెంబ్లీకి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. సీఎం ప్రవర్తనతో తామంతా విసిగిపోయామని వివరించారు. కిరణ్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిగ్గీ రాజాను కోరారు.