తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాజా పరిస్థితులు కిరణ్ వల్లే ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడిచేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రావాలంటే, కిరణ్ను దిగ్విజయ్ అదుపు చేయాలని సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక కిరణ్ రెడ్డి హస్తముందన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట మాజీ దివంగత ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం నోరు మెదపట్లేదని కేటీఆర్ చెప్పారు.
అలాగే టీడీపీ నేత పయ్యావుల కేశవ్., తమిళులతో పెట్టుకోవడంతో రాజీవ్ గాంధీ, సిక్కులతో పెట్టుకోవడం వల్ల ఇందిరాగాంధీ పోయారని, అలాగే తెలుగువారి ఉసురు సోనియా గాంధీకి తగులుతుందని వ్యాఖానిస్తుంటే కిరణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే కేసీఆర్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఎన్నో కేసులు పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు.