సీమాంధ్రలో ప్రజలు చేస్తున్న ఉద్యమం చూస్తుంటే తెలంగాణ లేకపోతే సీమాంధ్ర ప్రజలు బతకలేనట్లుగా ఉందని నిరూపితమయ్యిందని తెరాస నాయకుడు వినోద్ అన్నారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ చేపట్టిన చర్చా కార్యక్రమంలో వినోద్ పాల్గొని మాట్లాడారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో 10వ వంతు కూడా కాదన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రకు చెందిన ప్రజలు లక్షల్లో రోడ్లపైకి వస్తున్నారని సోనియా గాంధీతో చెప్పారన్నారు. అలాంటిది తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు కోట్లలో వచ్చారని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఒకవైపు తాము విడిపోతామంటుంటే కలిసి ఉండాలంటూ ఆందోళన చేయడం చూస్తుంటే, తెలంగాణను దోచుకుని తిని వదలలేని స్థితి వల్ల అలా అంటున్నారేమోనన్న అనుమానం వస్తుందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో దోపిడీతోనే సీమాంధ్ర నాయకులు బతుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణ విడిపోతే ఇక బతకలేమని అక్కడి ప్రజలకు నాయకులు చెప్పారనీ, అందువల్లనే వారు రోడ్లపైకి వస్తున్నారని వినోద్ వ్యాఖ్యానించారు.