దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు ప్రముఖ నటి, సమాజ్వాదీ పార్టీ మాజీ నేత జయప్రద వెల్లడించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఏ పదవినీ ఆశించి పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంపై తనకు ఉన్న నమ్మకంతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు జయప్రద తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేయడానికి బీజేపీలో చేరుతున్నారన్న వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తానెప్పుడూ అలా అనుకోలేదన్నారు. బీజేపీలోకి చేరతానని చెప్పిన విషయాన్ని మీడియానే హైలైట్ చేసి ఇలాంటి వార్తలకు అవకాశమిచ్చిందన్నారు. ఇకనుంచి డర్టీ పాలిటిక్స్కు స్వస్తి చెప్పి..ఆరోగ్యకరమైన రాజకీయాలను మాత్రమే చేయదలచుకున్నానని జయప్రద వెల్లడించారు.