కార్మిక సంస్కరణల మీద మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన లేబర్ రిఫార్మ్స్ బిల్లులు రెండింటిని లోక్సభలో ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్లు 2014 కాగా, మరొకటి అప్రెంటిస్ అమెండ్మెంట్ బిల్లు 2014 కావడం గమనార్హం.
ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకే ఈ బిల్లును తెస్తామని పైకి కేంద్రం చెబుతున్నప్పటికీ దాని అసలు లక్ష్యాలు వేరే వున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు కార్మికుల జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓవర్ టైమ్ పెంపు, మరిన్ని రంగాల్లో మహిళలకు నైట్ షిఫ్ట్లు, అప్రెంటిస్ చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలను అరెస్ట్ చేసే క్లాజ్ను తొలగించడం, కాంట్రాక్ట్, క్యాజువల్ వర్కర్స్ ని అప్రెంటిషిప్ పరిధిలోకి తీసుకురావడం లాంటివి ఈ బిల్లులోని అత్యంత కీలకాంశాలు. వీటిమీదనే కార్మిక వర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి చట్టమొకటి అమలులోకి వస్తే రేపు తమ జీవితాలు ఏమవుతాయోనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.