బీహార్ రాష్ట్రంలో భూకంపం ధాటికి 50 మంది మృత్యువాతపడినట్టు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యదర్శి స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, కార్యదర్శలు జిల్లాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలని సూచించినట్టు నితీశ్ కుమార్ తెలిపారు. అకాల వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలతో పాటు భూకంప బాధిత ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టాలని ఆదేశించారు.
భూకంప మృతులకు కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గత కొద్ది నెలలుగా ప్రకృతి ఉత్పాతాలతో బీహార్ ప్రజలు తల్లడిల్లారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాలతో పూర్నియా, ఇతర జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. వీటిని నుంచి కోలుకోకముందే భూకంపం సంభవించింది.
భూకంపంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. భూకంపం వల్ల దేశంలో 67 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించింది. బిహార్లో 47 మంది, ఉత్తరప్రదేశ్లో 17, బంగాల్లో ముగ్గురు మృతి చెందారు.